సర్వే జనా సుఖినో భవంతు

18, నవంబర్ 2014, మంగళవారం

ఉత్తరకుమారుడు :విశ్వ ధర్మం

పాండవులు మారువేషాల్లో విరాట మహారాజు కొలువులో అజ్ఞాతవాసం చేస్తుండగా కీచకుడిని భీముడి నర్తనశాలలో వధించాడు. కీచకుని మరణానికి కారకురాలైన ద్రౌపదిని ఉపకీచకులు తమ అన్న శవంతో కట్టి చంపటానికి తీసుకువెళ్ళారు. భీముడు ఉపకీచకులను కూడా వధించాడు. కౌరవులు విరాటుని కొలువులో పాండవులు ఉన్నారని గ్రహించి విరాట మహారాజు గోసంపదను చేజిక్కించుకోవటానికి సుశర్మను దక్షిణ దిక్కువైపు పంపి దక్షిణ గోగ్రహణానికి పథకం సిద్ధం చేశారు. తాము ఉత్తరం దిక్కు నుంచి విరాట మహారాజు గోసంపదను గ్రహించటానికి ఉత్తర గోగ్రహణానికి సన్నాహాలు పూర్తి చేసుకున్నారు. విరాట మహారాజు త్రిగర్తాధీశుడైన సుశర్మ మీదకు సైన్యాన్ని నడిపించాడు. ఇదే అదనుగా కౌరవులు ఉత్తర గోగ్రహణం చేశారు. ఆ సమయంలో అంతఃపురంలో ఉత్తరకుమారుడు స్త్రీజనుల మధ్యన సరససల్లాపాలతో ఉన్నాడు. ఉత్తర గోగ్రహణం జరిగిందని గోరక్షకుడు వచ్చి చెప్పాడు. తాను వెంటనే కౌరవులను ఓడించి గోవులను తీసుకువస్తానని ఉత్తరకుమారుడు ప్రగల్బాలు పలికాడు. కానీ తన రథాన్ని యుద్ధరంగంలో నడిపించేందుకు తగిన సారథి ఎవరూ దొరకలేదని ఒక సాకు చెప్పి మళ్ళీ స్త్రీలతో సరస సరాగాలకు దిగాడు. బృహన్నలగా రాకుమారి ఉత్తరకు అర్జునుడు నృత్యాన్ని నేర్పుతూ అప్పుడు ఆ కొలువులోనే ఉన్నాడు. జరిగిన విషయాన్నంతా గమనిస్తున్న సైరంధ్రి వేషంలో ఉన్న ద్రౌపది అర్జునుడికి వివరించింది. యుద్ధం చేసి కౌరవులను జయించేందుకు అర్జునుడు సంసిద్ధుడైనాడు. ఉత్తరకుమారుడి దగ్గరకు వెళ్లి గతంలో అర్జునుడి రథానికి సారథిగా ఉన్న బృహన్నల మన కొలువులోనే ఉన్నాడని ఖాండవ వన దహనం వంటి అనేక సందర్భాల్లో అర్జునుడి విజయానికి బృహన్నలే కారణమని ఉత్తర కుమారుడికి చెప్పమని అర్జునుడు ద్రౌపదిని పంపించాడు. ద్రౌపది విషయాన్నంతా చెప్పింది. తొలుత బృహన్నల తన వంటి వీరపురుషుడికి రథసారథిగా ఉండటమా అని ఉత్తరుడు కొంత హేళనగా అన్నా తరువాత తప్పింది కాదు. అర్జునుడు బృహన్నలగానే రాకుమారుడి రథానికి సారథ్యం వహించి తన శక్తియుక్తులు అన్నింటినీ ప్రదర్శిస్తూ యుద్ధరంగానికి రథాన్ని నడిపించాడు. ఎదురుగా ఉన్న అనంత కౌరవ సేనావాహినిని చూసేసరికి ఉత్తరుడికి కాళ్ళు వణికాయి. బతికుంటే బలుసాకు తినవచ్చునని రథాన్ని వెనక్కి తిప్పమని ప్రాధేయపడ్డాడు. కానీ వీరుడి లక్షణం వెన్నుచూపడం కాదని వీరోచితంగా పోరాడి శత్రువులను మట్టుపెట్టాలని అర్జునుడు ఉత్తరకుమారుడికి ధైర్యాన్ని నూరిపోశాడు. కేవలం ప్రగల్భాలు పలికి పొద్దుపుచ్చుకూడదని కష్టకాలంలో వీరోచితంగా పోరాడి కష్టాలను ఎదుర్కోవాలని అర్జునుడు చేసిన హితబోధ ఒక్క ఉత్తరకుమారిడికే కాదు ఆరంభ శూరత్వంతోనూ, ప్రగల్బాలతోనూ కాలం వెళ్లదీసే అందరికీ అది చక్కటి బోధామృతం. ఉత్తరకుమారుడు ఆ బోధామృతాన్ని అందించిన అర్జునుడి సహకారంతోనే ఉత్తర గోగ్రహణం సమయంలో విజయాన్ని చేజిక్కించుకోగలిగాడు. అర్జునుడి మాటలలోని ఆత్మస్త్థెర్యాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవచ్చు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Related Posts Plugin for WordPress, Blogger...