భారతీయ సంప్రదాయక పురాణాలు, ఇతిహాసాలు అన్నీ
మానవాళికి మంచి మార్గాన్ని బోధించటానికే
ఆవిర్భవించాయి. జనమేజేయ మహారాజు తండ్రి అయిన పరీక్షిత్తు మహారాజు కథ కూడా మానవులకు ఒక జవీన సందేశాన్ని
అందిస్తోంది. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు
తప్పే. దాని ఫలితాన్ని తప్పు చేసిన వాడు అనుభవించి తీరుతారు అన్న సత్యం పరీక్షిత్తు కథలో వెల్లడవుతోంది.
పరీక్షిన్మహారాజు ప్రజలను కన్నబిడ్డల్లా పాలిస్తూ తన రాజ్యంలో ధర్మం
నాలుగు పాదాలా నడిచేలాగా ప్రజారంజకంగా పరిపాలన
చేస్తూ ఉండేవాడు. అంతటి మహారాజుకు కూడా వ్యసనాలలో ఒకటయిన వేట మీద బాగా ధ్యాస ఉండేది. ఒకనాడు ఆ రాజు
అడవిలో వేటాడుతుండగా అతని బాణపు గురిని
తప్పించుకుని ఒక మృగం పారిపోయింది. దాని వెంటపడి పరిగెడుతున్న రాజుకు ఒకచోట బాగా అలసట అనిపించింది.
దాహం తీర్చుకోవటానికి ఆ పక్కనే కనిపిస్తున్న ఒక
ఆశ్రమంలోకి వెళ్ళాడు. అది శమీకుడు అనే ముని ఆశ్రమం. ఆ ముని ఎవరితోనూ సాధారణంగా మాట్లాడడు. ఆ విషయం
తెలియని రాజు నా బాణపు గురి నుంచి తప్పించుకున్న ఒక
మృగం ఇటు పరిగెత్తుకు వచ్చింది. దానిని మీరు చూశారా అని ప్రశ్నించాడు. ముని జవాబు ఇవ్వలేదు. రాజు
కోపంతో తనంతటివాడు వచ్చి అడుగుతున్నా సమాధానం చెప్పనందుకు ముని మీద కోపం
పెంచుకున్నాడు. ఆ పక్కనే చచ్చిపడి ఉన్న ఒక పామును తెచ్చి ఆ ముని
మెడలోవేసి తన కోపం చల్లార్చుకుని రాజు వెళ్ళిపోయాడు. శమీక మహర్షికి
శృంగి అనే కొడుకు ఉన్నాడు. ఈ సంఘటన జరిగిన కొద్ది
సమయానికి శృంగి అక్కడికి వచ్చి మౌనముద్రలో ఉన్న తన తండ్రిని అవమానించిన వారి మీద విపరీతంగా కోపం
తెచ్చుకొని ఈ అవమానమునకు కారణమైనవాడు ఏడు
రోజులలోగా తక్షకుడు అనే సర్పరాజు కాటుకు బలి అగుగాక! అని శాపమిచ్చి తన తండ్రి మెడలోని పామును తీసివేసే సమయంలో
కళ్లు తెరిచి జరిగినదంతా తెలుసుకున్న శమీకుడు తన కొడుకును మందలించి
రాజులు మన వంటి వారి రక్షణ కోసం ఎన్నో
విధాలుగా కృషి చేస్తుంటారు. అటువంటి వారిని తొందరపడి శపించటం మంచిది కాదు అని చెప్పి పశ్చాత్తపుడై తన
శిష్యులలో ఒకడయిన గౌరముఖుడు అనే పేరుగల శిష్యుడిని చేరపిలిచాడు.
పరీక్షిన్మహారాజు వద్దకు వెళ్లి జరిగినది వివరించి
శాపమునకు విరుగుడు లేదని, కానీ మీ జాగ్రత్తలో మీరు ఉండవలసినదని చెప్పి ఆ శిష్యుడు ఆశ్రమానికి
బయలుదేరాడు. తాను చేసిన పని ఎంతటి ప్రమాదం
తెచ్చిపెట్టిందో అప్పుడు తెలిసివచ్చింది రాజుకు.
వెంటనే తన మంత్రులతో సమావేశమై పాము వంటి జంతువులు
ప్రవేశించవీలులేనటువంటి ఒక ఒంటి స్తంభపు మేడ కట్టించుకుని
అందులో తగిన రక్షణను ఏర్పాటు చేసుకొని కాలం గడుపుతున్నాడు. శుకమహర్షి చేత భాగవతాన్ని చెప్పించుకొని వినటం ప్రారంభించాడు. తక్షకుడి నుంచి తప్పించుకోవటానికి
మంత్రతంత్రాలను ఏర్పాటు చేసుకొన్నాడు. ఒకవేళ అవి
అన్నీ ఫలించక మరణం సంభవిస్తే భాగవతం విన్న పుణ్యఫలితమన్నా దక్కుతుందని అతని ఆలోచన. బ్రహ్మదేవుడిచేత సర్పాల విషాన్ని హరించే సంజీవిని విద్య పొందిన కశ్యపమహర్షి
పరీక్షిన్మహారాజును రక్షించడానికి
బయలుదేరాడు. కానీ దోవలో తక్షకుడు తన మాయచేత కశ్యపమహార్షిని వారించి అతని మనసును మార్చి వెనుకకు పంపినాడు. శృంగి
శాపము ప్రకారము 7వ రోజు సమీపించింది. ఆ
రోజున సూర్యాస్తమయం అవుతుండగా తక్షకుడు కొంత మంది నాగకుమారులకు ముని బాలకుల వేషం వేసి కొన్ని అద్భుత
ఫలాలనిచ్చి పరీక్షిత్తు దగ్గరకు పంపించాడు. రాజు
సూర్యాస్తమయం అవుతున్నదని మరికొద్ది సేపటిలో తనకు శాపము నుంచి విముక్తి కలుగుతుందని భ్రమపడి మాయా
మునిబాలకుల దగ్గర ఉన్న ఒక పండును తీసికొని
చిదిమాడు. వెంటనే అందులో నించి చిన్న పురుగు రూపంలో ఉన్న తక్షకుడు బయటకు వచ్చి శృంగి శాప ప్రకారము
పరిక్షిన్మహారాజు ప్రాణాలు తీశాడు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి